ముఖ్యమంత్రి కెసిఆర్కు జలుబు, గొంతునొప్పి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జలుబు, జ్వరం కారణంగా ఆయన శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న 66వ జాతీయ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్కు హాజరుకాలేకపోయారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కావాల్సి ఉంది.
మధ్యాహ్నం సిఈఓల విందులోనూ ఆయన పాల్గొంటానని అంతకుముందు చెప్పారు. ఉదయం 10.15గంటల సమయంలో కూడా కెసిఆర్ సదస్సుకు హాజరవుతారని సిఎం కార్యాలయం వెల్లడించింది. అయితే, ఆ తర్వాత జలుబు అధికం కావడం, గొంతు నొప్పి కారణంగా ఆయన సదస్సుకు హాజరు కారాదని నిర్ణయించారు. దీంతో ఈ సమాచారాన్ని నిర్వాహకులకు తెలియజేశారు.
సిఎం కెసిఆర్ సూచన మేరకు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్కు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి రాజయ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు సిఈఓల విందు కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిఎం హాజరుకాకపోవడంతో సిఈఓలు కొంత నిరాశ చెందారు. కాగా, సిఎం అనారోగ్య కారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్న కెసిఆర్ సాయంత్రం పూట తన నివాసంలో కేంద్రబృందంతో స్వైన్ ఫ్లూపై జరిగిన భేటీలో పాల్గొన్నారు.