పెళ్లికి ఊహించని అతిథి: కేసీఆర్ ఆశీర్వాదం, మర్చిపోలేమన్న కొత్త జంట(పిక్చర్స్)
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓ కొత్త జంటను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గురువారం ఉదయం రైతుబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ వాహనశ్రేణి గురువారం ఉదయం కరీంనగర్ నుంచి కేశవపట్నం మీదుగా హుజూరాబాద్కు బయలుదేరింది.

పెళ్లిని గమనించి కారు దిగిన కేసీఆర్..
అటవైపు దూసుకెళుతున్న వాహనశ్రేణి మార్గమధ్యలోని శంకరపట్నం మండలం తాడికల్ వద్ద రహదారి పక్కన మెల్లగా ఆగింది. సీఎం వెంట వెళుతున్న నాయకులు, పోలీసులకు ఏం జరిగిందో అర్ధం కాలేదు. అదే సమయంలో రోడ్డు పక్కన వొడ్నాల ఉమ లక్ష్మీనారాయణల కుమార్తె కావ్య వివాహం జరుగుతుండగా గమనించిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తన వాహనం నుంచి కిందకు దిగారు.

అనుకోని అతిథి రావడంతో..
అనుకోని అతిథిగా వచ్చిన కేసీఆర్ను చూసిన నూతన వధూవరులు, బంధువులు, స్థానికులు ఆనందంతో సంభమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టలేని సంతోషంతో వధూవరులు కావ్య, మనోహర్ ముఖ్యమంత్రి వాహనం దగ్గరికి వెళ్లారు.

ఆశీర్వదించిన కేసీఆర్..
నాయకులు అక్షింతలు తెచ్చివ్వగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించారు. మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

చిరకాలం గుర్తిండిపోయే మధురానుభూతి..
కాగా, ‘ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మా పెళ్లికి రావడాన్ని జీవితంలో మరచిపోలేం. అంత పెద్దవ్యక్తి మా కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్క క్షణం పాటు తేరుకోలేదు. నిండు మనసుతో ఆయన ఇచ్చిన దీవెనలను చిరకాలం మధురానుభూతిగా గుర్తుంచుకుంటాం' అని నూతన దంపతులు కావ్య, మనోహర్లు ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications