జగన్ హెల్త్ బులిటెన్ విడుదల: కేసీఆర్ ఫోన్, దాడి, చికిత్సపై ఆరా
హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ జగన్ హైదరాబాద్లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ఎవరీ శ్రీనివాస్?: జగన్ అభిమానా? టీడీపీ అనుచరుడా? ఈ ఫొటోల సంగతేంటి?
భుజానికి తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. జగన్ భుజానికి తొమ్మిది కుట్లు వేశామని గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వైద్యులు తెలిపారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న ఆసుపత్రి వైద్యులు#AttackOnYSJagan pic.twitter.com/eK990Dwr6J
— YSR Congress Party (@YSRCParty) October 25, 2018
దుండగుడు పొడిచిన కత్తి వైఎస్ జగన్ శరీరంలోకి బలంగా దిగిందని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు 3సెంటీమీటర్ల లోతుకు కత్తి దిగిందన్నారు. ప్రస్తుతం వైయస్ జగన్ ఆరోగ్య నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ముంబైకి పంపామన్నారు. కత్తికి విషం పూశారా, లేదా అన్నది పరీక్షల తర్వాతే తెలుస్తుందన్నారు. రిపోర్ట్ వచ్చాక డిశ్చార్జ్ ఎప్పుడనేది చెబుతామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అబ్జర్వేషన్లోనే ఉండమని చెప్పామన్నారు.
జగన్మోహన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్
కత్తి దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయం తీవ్రత, చికిత్స విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. గాయం మానే వరకు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డికి సూచించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. జగన్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.