తప్పు దిద్దుకో, ఛార్జీలు పెంచితే అప్పుడు చెప్తా: కేసీఆర్కు కోదండ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ మరోసారి భగ్గుమన్నారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించక పోవడం బాధాకరమని, ఆగస్టు 6వ తేదీన ఆయన జయంతిని నిర్వహించి తప్పు సరిదిద్దుకోవాలన్నారు.
మల్లన్ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను బయటపెట్టాలన్నారు. బాధితులను చట్ట ప్రకారం ఆదుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరిగినట్లుగా కనపిించలేదని, చట్టాలను ఉల్లంఘించినట్లుగా కనిపించిందన్నారు.
ప్రస్తుతం ఎవరూ ఎవరినీ అడ్డుకునే పరిస్థితి లేదన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచితే తాను అప్పుడు తప్పకుండా మాట్లాడుతానని కోదండరామ్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పైన పొంగులేటి ఆగ్రహం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం సాధించి తెరాసలో చేరిన ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, కేసీఆర్ అపాయింటుమెంట్ ఇప్పించాలని కోరుతూ పొంగులేటి మండలి చైర్మన్ స్వామి గౌడ్కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. శాసన మండలి సభ్యులన్న గౌరవం లేకుండా కేసీఆర్ ఎమ్మెల్సీలకు అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు. పార్టీలు వేరైనా అధికారంలో ఉన్న సీఎంగా విపక్ష ఎమ్మెల్సీలకు కూడా అపాయింటుమెంట్లు ఇచ్చి మండలి గౌరవాన్ని కాపాడాలన్నారు.
ఇదే విషయాన్ని చైర్మన్ స్వామి గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా సభ్యుల గౌరవం తగ్గేలా ఉండవద్దన్నారు. కళంకం తెచ్చేలా ఫిరాయింపులు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ మరోసారి భగ్గుమన్నారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించక పోవడం బాధాకరమని, ఆగస్టు 6వ తేదీన ఆయన జయంతిని నిర్వహించి తప్పు సరిదిద్దుకోవాలన్నారు.