డ్యామిడ్ రేవంత్ కథ అడ్డం తిరిగింది; తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి; మునుగోడులో రేవంత్ కింకర్తవ్యం!!
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారగా, కాంగ్రెస్ పార్టీకి మాత్రం జీవన్మరణ సమస్యగా తయారయింది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములాగా మారింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే, మునుగోడులో పాగా వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని, కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ పంచాయితీ పెద్ద తలనొప్పిగా తయారైంది.

తమ్ముడిపై అన్న ఉప ఎన్నికల ప్రచారం .. ప్లాన్ చేసిన టీపీసీసీ రేవంత్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం, ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేదని మొదట ప్రచారం జరగగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయనే నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక ఇదే సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే తమ్ముడు మీద అన్ననే ఎన్నికల ప్రచారానికి బరిలోకి దింపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా భావించారు.

మునుగోడు రిస్క్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పెట్టాలని రేవంత్ ప్లాన్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మునుగోడు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందని, ఒకవేళ అలా గెలిపించకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇమేజ్ అధిష్టానం వద్ద మరింత తగ్గుతుందని, ఇక మునుగోడు రిస్కు తాను తీసుకోకుండా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద పెడితే మంచిదని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికీ చెక్ పెట్టినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారు.

ప్రచారంలో పాల్గొననని కోమటిరెడ్డి ప్రకటనతో అడ్డం తిరిగిన రేవంత్ రెడ్డి కథ
స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరును ప్రకటించి బాధ్యతను ఆయనకే అప్పజెప్పాలని నిర్ణయించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో రేవంత్ రెడ్డి కథ అడ్డం తిరిగింది. తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పట్టం కట్టి పార్టీని నాశనం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ మాదిరిగా మునుగోడు లో కూడా 3, 4 వేల ఓట్లు కాంగ్రెస్ తెచ్చుకుంటుంది, అంతకు మించి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని సొంతపార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
30 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నా తనకు గుర్తింపు లేదని నాలుగు పార్టీలు మార్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో మండిపడ్డారు. పార్టీని నాశనం చేస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతోంది అంటూ కోమటిరెడ్డి పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ వీడి వెళ్లేది లేదని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి.. రేవంత్ కింకర్తవ్యం?
ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొనటం లేదని స్పష్టంగా తెలుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఇరికించి ఏం జరుగుతుందో వినోదం చూడాలనుకున్న రేవంత్ రెడ్డి కథ ఊహించనివిధంగా అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది? ఎన్నికల్లో పరువు పోకుండా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించటం ఎలా అన్నది రేవంత్ రెడ్డి ముందు ఉన్న అతి పెద్ద సవాల్.












Click it and Unblock the Notifications