ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.

అలా జరిగితే ఒక్క ఊరు కూడా...
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లే కాలువకు గండి పడిందని.. చిన్న కాలువల పరిస్థితే ఇలా ఉంటే 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, గందమల్ల ప్రాజెక్టుల పరిస్థితి గురించి ఆలోచిస్తేనే భయమేస్తోందని రేవంత్ అన్నారు. వాటికి కూడా ఇలాగే గండిపడితే.. వాటి పరిధిలో ఒక్క ఊరు కూడా మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు.

కమీషన్ల కక్కుర్తితోనే నాణ్యత లోపాలు
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫాంహౌస్కు పోయే కాలువ పనుల్లోనే ఈ స్థాయిలో నాణ్యతా లోపాలు బయపడితే... ఇక రాష్ట్రంలో జరిగిన మిగతా కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్, మెఘా ఇంజినీరింగ్ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపాలే నిదర్శనమన్నారు రేవంత్. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్ముతోనే కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.

రేవంత్ సెటైర్స్.. పనిమంతుడు పందిరేస్తే...
ఇదే విషయంపై సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్స్ వేశారు. పనిమంతుడు పందిరి వేస్తే... పిట్ట వాలగానే కూలిందట... అలా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌజ్కు నిర్మించిన కెనాల్ గండిపడి వెంకటాపురం గ్రామం మునిగిందని రేవంత్ విమర్శించారు. అవినీతి కట్టలు తెగిందని... ఇదీ 'మెగా మేత' ఘనతేనని.. ఈ కెనాల్ను జాతి జలగ ప్రారంభించి వారమైందని ఎద్దేవా చేశారు.

మునిగిన వెంకటాపురం గ్రామం..
కేసీఆర్ చేతుల మీదుగా నెల రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు కాలువకు మంగళవారం(జూన్ 30) గండి పడింది. దీంతో సమీపంలోని వెంకటాపురం గ్రామాన్ని ఆ వరద ముంచెత్తింది. జగదేవ్పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని ఎం. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఉన్న చెరువులు నింపడానికి కొండపోచమ్మ సాగర్ నీటిని విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌజ్కు 3కి.మీ దూరంలో కాలువకు గండిపడటంతో వెంకటాపురం గ్రామం మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. అధికారులు వెంటనే అప్రమత్తమై కుడి కాలువకు నీటిని నిలిపివేశారు.












Click it and Unblock the Notifications