గుజరాత్లో పవర్ హాలిడే.. డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్: కేటీఆర్ ఘాటు విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాటల యుద్ధానికి దిగుతుంటే, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అధికార టీఆర్ఎస్ నేతలు. రానున్న ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే, అధికార టీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేసి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ మండిపడుతోంది. తెలంగాణలో బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని సవాళ్ళు విసురుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అంశంపై రాజకీయ రగడ కొనసాగుతుంది.
ధాన్యం కొనుగోళ్ళ రగడ నుండి బీజేపీని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్
ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంలోని బీజేపీతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. మరోపక్క పెరిగిన పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలపై కూడా సమర శంఖాన్ని పూరించింది. కేంద్రంలోని బిజెపి సర్కార్ పై ఒత్తిడి పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం విఫలయత్నం చేస్తుంది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
గుజరాత్ మోడల్ పై మండిపడిన కేటీఆర్
ఇక ఇదే సమయంలో ఒకపక్క కేంద్రంతో వరి వార్ కంటిన్యూ చేస్తూనే బిజెపి పాలనపై విరుచుకు పడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తాజాగా గుజరాత్ మోడల్ పైన ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో వారానికి ఒకరోజు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడాన్ని చూపించి ఇదేనా డబుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. పవర్ ఫుల్ వ్యక్తులు వచ్చిన రాష్ట్రంలో ఇండస్ట్రీకి పవర్ హాలిడే అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడే.. ఇది డబుల్ ఇంజనా .. ట్రబుల్ ఇంజనా ?
బిజెపిని సూటిగా టార్గెట్ చేస్తున్న మంత్రి గుజరాత్ మోడల్ అద్భుతం కాదంటూ ఈ పోస్ట్ చేశారు. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ జారీచేసిన లెటర్ ను తన ట్వీట్ కు జత చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ గుజరాత్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడే అంటూ వ్యాఖ్యానించారు. ఇది డబల్ ఇంజనా ? లేక ట్రబుల్ ఇంజనా అంటూ సూటిగానే ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే ఉద్దేశంతో బిజెపి పదే పదే చెప్పే డబల్ గ్రోత్ ఇంజన్ మోడల్ అంటే ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలంగాణాపై ఫోకస్ చేస్తున్న బీజేపీని టార్గెట్ చేస్తున్న మంత్రి కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంతగడ్డ గుజరాత్ లో ఇలాంటి పరిస్థితులు ఉంటే డబుల్ గ్రోత్ ఇంజన్ మోడల్ అని ఎలా చెబుతారు అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ ఏమి అద్భుతం కాదని పేర్కొన్న కేటీఆర్, అంత గొప్పగా అభివృద్ధి చేస్తే పరిశ్రమలకు పవర్ హాలిడే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ని టార్గెట్ చేయడం కోసం కేటీఆర్ బిజెపి వైఫల్యాలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలలో బీజేపీపై విముఖత పెరిగేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.