రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. జగీశ్ రెడ్డి స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా ఆయనకు ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు.

స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయలని.. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టంగా చెప్పామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలూ తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అయినా పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారన్నారు.
ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి.. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యకు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. పేరుకేమో ప్రజాపాలన చేసేదేమో అప్రజాస్వామిక పనులు. రైతాంగం తరుఫున, ఆడబిడ్డల తరుఫున, ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే, తట్టుకోలేక కుయుక్తితో జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
ప్రజల తరఫున శాసన సభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, రేవంత్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనానికి పిలుపునిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఆ భయంతోనే సస్పెండ్ చేశారు: జగదీశ్ రెడ్డి
మరోవైపు, జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రశ్నిస్తారని, నిన్న రేవంత్ క్లాస్ పీకిండని, ఆయన మెప్పు పొందడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి సస్పెన్షన్లు ఏవీ మమ్మల్ని ఆపలేవు, ప్రజాక్షేత్రంలో మా గొంతు నొక్కలేవని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రజలు పడుతున్న కష్టాలను శాసనసభలో మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశానే తప్ప, అందులో ఒక్క తప్పు మాట కానీ, స్పీకర్ని కించపరిచే మాట కానీ అనలేదు. నేను మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పి నిలబెడతాననే భయంతోనే నన్ను అక్రమంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు అని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications