ఏపికి సిఎం అయినా తెలంగాణలో ఓటరే, జాగ్రత్త: బాబుపై కెటిఆర్
మహబూబ్నగర్: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో ఓటరేనని, ఇక్కడ తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలంగాణ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని ఏసీబీ భావిస్తే నోటీసు జారీ చేస్తుందని, చంద్రబాబు విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
తప్పు చేయలేదనుకుంటే, ఆయన విచారణకు సిద్ధమై కడిగిన ముత్యంలా బయటకు రావాలని సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో అమెజాన్ గోదామును ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.
‘తన రక్షణ కోసం చంద్రబాబు తెలంగాణ పోలీసులను తీసేసి ఆంధ్రా పోలీసులను తెచ్చుకున్నారు. అదే విధంగా కరెంట్, నీళ్లు, పాలు, కూరగాయలు కూడా ఆంధ్రా నుంచే తెచ్చుకుంటారా? ఇదేం పద్ధతి?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికి పాలమూరు జిల్లాకు, తెలంగాణకు తలవంపులు తెచ్చారని విమర్శించారు. రేవంత్ను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. సమస్య ఏపీ ప్రజలది కాదని అన్నారు. ప్రజలను అడ్డం పెట్టుకుని శిఖండిలా బయటపడతామనుకుంటే కుదరదని కెటిఆర్ హెచ్చరించారు.
‘ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్నా చట్టం ఎవరికీ చుట్టం కాదు. కేంద్రం ఎదుట మోకరిల్లినా శిక్ష నుంచి తప్పించుకోలేవు. మీ ఎమ్మెల్యే ఇప్పటికే జైల్లో ఉన్నాడు. నీపైనా ఆధారాలున్నాయని ఏసీబీ నోటీసులు ఇస్తే విచారణ ఎదుర్కోక తప్పదు' అని చంద్రబాబుపై కేటీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారని టీడీపీ నేతలంటున్నారు.. అంటే బాబు తప్పును ఒప్పుకున్నట్లేనన్నారు.












Click it and Unblock the Notifications