కేటీఆర్ నువ్వో పిల్ల కాకివి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు: భట్టి విక్రమార్క
ఆర్మూర్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ పై శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
హైదరాబాద్: కేటీఆర్ ఓ పిల్ల కాకి అని, మాట్లాడేటప్పుడు ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్లో అంతర్గత పోరును కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గురువారం నిజామాబాద్ లోని ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన జనహిత ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో అధిక సమయం పాలించిన కాంగ్రెస్ నేతలు ఇంతకాలం గుడ్డి గుర్రాలకు పండ్లు తోమి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రాజెక్టులపై కేసులేసి అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దీనిపై భట్టి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై కేటీఆర్ చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం అన్నారు.. కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. అలాగే మనువడితో శ్రీరాముడి కళ్యాణానికి తలంబ్రాలు అందివ్వడం దారుణమని, తెలంగాణలో తమకు అడ్డు లేదని, తామేం చేసినా చెల్లుతుందనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విక్రమార్క దుయ్యబట్టారు.