సంక్రాంతి వేళ.. విషాదం: TGSRTC బస్సు ప్రమాదంలో.. !!
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
ఇప్పుడు తాజాగా జడ్చర్ల వద్ద మరో టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు బయలుదేరిన కొల్లాపూర్ డిపోనకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు అది. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారందరూ కూడా సంక్రాంతి పండగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తోన్నారు.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈ వేకువ జామున 1:45 గంటల సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పింది. ముందు వెళ్తోన్న డీసీఎం వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముందు వరసలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ క్యాబిన్ భాగం మొత్తం కూడా కోసుకుపోయింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని తొలు జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్ నగర్ కు జనరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు. ముందు వెళ్తోన్న డీసీఎం వాహనం సడన్ గా బ్రేక్ వేయడమే దీనికి కారణమని భావిస్తోన్నారు. అతివేగం కూడా ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ ప్రమాదంతో కర్నూలు వైపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ప్రమాదం రోడ్డు భద్రతపై భయాందోళనలకు దారి తీసింది. సంక్రాంతి సీజన్ లో డ్రైవర్, కండక్టర్ కు విశ్రాంతి లభించట్లేదని, సింగిల్ డ్రైవర్ దూర ప్రాంతాలకు కూడా బస్సులను నడిపిస్తోన్నారనే ఆరోపణలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications