కేంద్రీయ విద్యాలయాల్లో సీటు దక్కాలంటే - అర్హతలు, మార్గదర్శకాలు..!!
కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యా సంవత్స రానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అర్హతలు..దరఖాస్తు విధానం గురించి స్పష్టత ఇచ్చింది. 11వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనుండగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు అవకాశం కల్పించింది. మిగిలిన తరగతుల్లో ప్రవేశాలకు విద్యాలయా లకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమర్పించాలి.విద్యార్ధుల వయో పరిమితి పైన నోటిఫికేషన్ లో స్పష్టత ఇచ్చారు.
తాజా నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు మార్చి 31వ తేదీ నాటికి ఆరు నుంచి 8 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న విద్యార్ధులు అర్హులుగా పేర్కొన్నారు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులను పరిశీలించి, లాటరీలో ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన్ నేరుగా ఆయా కేవీఎస్ లకు అందజేస్తుంది. మిగిలిన తరగతుల్లో ప్రవేశాలకు విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమ ర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయించనున్నారు. తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2న, మూడో జాబితా ఏప్రిల్ 7న ఉంటుంది.

వీరికి ప్రాధాన్యత
ఇక, అడ్మిషన్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ ప్రాధాన్యం కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యం ఉంటుంది. విద్యాహక్కు చట్టం కింద 10 సీట్లు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు అర్హులుగా పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు రిజర్వేషన్ ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం ఉంటుంది.
ఎంపిక ఇలా
రెండో తరగతిలో ప్రవేశానికి 7-9 ఏళ్లు, 3, 4వ తరగతుల విద్యార్థులకు 8-10ఏళ్ల వయస్సు, 5వ తరగతికి 9-11, ఆరుకు 10-12గా వెల్లడించారు. అదే విధంగా 7వ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, 9వ తరగతికి 13-15, 10వ తరగతికి 14-16 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫి కేషన్ లో స్పష్టం చేసారు. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి తరగతికి రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్కు 40 సీట్ల చొప్పున 80 మందికి ప్రవేశం ఉంటుందని వివరించారు.ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయనుండగా 2నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కేవీఎస్ అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications