కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్ : టీఆర్ఎస్ లో చేరినంత మాత్రానా వాళ్లంతా పునీతులా!
హైదరాబాద్ : గత ప్రభుత్వాల అలసత్వం వల్లే హైదరాబాద్ పరిస్థితి అద్వాన్నంగా తయారైందని చెబుతోన్న సీఎం కేసీఆర్.. అప్పటి ప్రభుత్వాల్లో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న విషయాన్ని మరిచిపోవద్దంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేత లక్ష్మణ్.
హైదరాబాద్ లో ఆక్రమణలకు పాల్పడ్డ ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల అక్రమాలకు దోహదపడిన కార్పోరేటర్లు, సర్పంచ్ లు, ఇతర నేతలంతా ప్రస్తుతం టీఆర్ఎస్ కండువా కప్పుకుని సీఎం కేసీఆర్ పక్కన్నే తిరుగుతున్నారని.. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు సవాల్ చేశారు లక్ష్మణ్.
గత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ పరిస్థితి ఇలా తయారైందని కేసీఆర్ చెబుతున్నారని, మరలాంటప్పుడు అప్పటి ప్రభుత్వాల్లో పనిచేసిన నేతలంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరగానే పునీతులైపోతారా? అని ప్రశ్నించారు లక్ష్మణ్. ఆక్రమణలకు పాల్పడ్డది టీఆర్ఎస్ నేతలైనా మరెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిపట్ల కఠిన వైఖరిని అవలంభించకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందుతాయోనని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితిని సవరించేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్ లో చేపట్టబోయే చర్యల గురించి సమగ్ర వివరాలను స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు నగరంలో ఉన్నది 10శాతం రోడ్లు కాదని, 99శాతం మేర రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ బాట పడుతామని తెలియజేశారు. కాగా, అక్టోబర్ 2వ తేదీన బీజేపీ కార్యకర్తలంతా విధిగా చేనేత వస్త్రాలను ధరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన.