దేవరుప్పుల కస్తూర్బా స్కూల్ లో భోజనంలో బల్లి, 14మందికి అస్వస్థత, స్పందించిన మంత్రి ఎర్రబెల్లి!!
జనగామ జిల్లా దేవరుప్పుల లోని కస్తూర్బా పాఠశాలలో భోజనంలో బల్లి పడిన ఆహారం తిని 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ప్రస్తుతం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది.

భోజనంలో బల్లి.. అస్వస్థతకు గురైన విద్యార్థులు
రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీవాణికి పెట్టిన భోజనంలో బల్లి వుండడంతో తోటి బాలికలు గుర్తించారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే వారు భోజనం చేయగా కొంతమంది విపరీతమైన కడుపునొప్పితో బాధ పడ్డారు. మరికొంతమంది భోజనంలో బల్లి పడిందని తెలిసి వాంతులు చేసుకున్నారు. గురువారం రాత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు 108కు సమాచారం అందించగా రెండు అంబులెన్సులలో 14 మందిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన , జనగామ ఏరియా ఆస్పత్రిలో విద్యార్థినులు
భోజనంలో బల్లి పడిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన సమాచారంతో తల్లిదండ్రులు కస్తూర్బా బాలికల విద్యాలయానికి వచ్చి పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విద్యార్థులను అధికారులు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి కలెక్టర్ ను అడిగి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల కస్తూర్బా పాఠశాలలో బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. మునుగోడు పర్యటనలో ఉన్న ఆయన అన్నంలో బల్లి రావడం పై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం చేయించేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అవసరమైతే వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

విచారణకు ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి
ఇక ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తే, నిర్లక్ష్యమే దీనికి కారణం అయితే దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు దగ్గరుండి వైద్యం చేయించాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులతో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications