బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు, 10 రోజుల పట్టణ ప్రగతి, క్యాబినెట్ నిర్ణయాలివే..
పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో కార్యక్రమం నిర్వహించాలని మంత్రివర్గం డిసిషన్ తీసుకుంది. విది విధానాలు ఖరారు చేసేందుకు ఈ నెల 18వ తేదీన ప్రగతి భవన్లో రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 6 గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Recommended Video
రాజీవ్ స్వగృహ ఇళ్లు వేలం..
రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేసి విక్రయించాలని తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొన్నది. విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా కమిటీని నియమించింది. అభయ హస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్ రావు, సందీప్ సుల్తానియాకు అప్పగించారు. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
పచ్చలహారాలు
రాష్ట్రంలో మంచి నగర జీవనం కోసం పట్టణ ప్రగతి పునాది కావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పట్టణాలు పచ్చలహారాలుగా మారాలన్నారు. ప్రణాళికబద్దమైన ప్రగతితో ఇది సాధ్యమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిని ప్రజలందరూ విసృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రస్థాయి సదస్సు
పట్టణ ప్రగతి కోసం 18వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఆ రోజు మద్యహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్మించిన వెజ్-నాన్ వెజ్ మార్కెట్, శ్మశాన వాటికను సందర్శించడానికి తీసుకెళతామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో వార్డు యూనిట్గా ప్రగతి జరగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యులను గుర్తించాలని సూచించారు.
బల్దియాకు 78 కోట్లు
మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి.. 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.70 కోట్లు చొప్పున విడుదల చేస్తామనే భరోసానిచ్చారు. పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరనున్నాయి. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 811 కోట్లలో 500 కోట్లు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, 311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
పచ్చదనం
డ్రైనేజీలు శుభ్రం చేసి, మురికి గుంతలు పూడ్చాలని నిర్ణయం తీసుకున్నారు. మొక్కలు నాటి హరిత ప్రణాళిక రూపొందించాలని భావించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పట్టణాల్లో ప్రధాన రహదారులను మెరుగు పరిచి, గుంతలను పూడ్చాలని నిర్ణయం తీసుకొన్నారు. శ్మశానా వాటికలకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకొని.. స్థలాల ఎంపిక చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.