నోయిడాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సందేశ్ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తుపాకీతో కాల్చి, ఆపై గొడ్డలితో నరికి అతన్ని కిరాతకంగా హతమార్చారు. స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు.
నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్కాలనీకి చెందిన సందేశ్ రెండేళ్ల క్రితం నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) కోర్సులో చేరారు. తొలి ఏడాది హాస్టల్లో ఉండి చదువుకున్న సందేశ్ రెండో సంవత్సరం నుంచి నోయిడా సెక్టార్-100లోని లోటస్ బ్లోవర్డ్ అపార్ట్మెంట్లో 1804 ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు.
అమిటీ యూనివర్సిటీలో టూరిజం మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీ అదే అపార్ట్మెంట్లో 1303లో అద్దెకు ఉంటున్నారు. శనివారం సాయంత్రం అమన్, మౌంటీలు సందేశ్ అపార్ట్మెంట్ 1804కు వెళ్తున్నట్లు సెక్యూరిటీ వద్ద సంతకం చేసి ఆ బ్లాక్లోకి వెళ్లారు. నేరుగా ఫ్లాట్ వద్దకు వెళ్లి అమన్ కాలింగ్బెల్ నొక్కాడు. సందేశ్ తలుపు తీయగానే వెంటనే పిస్టల్తో కాల్పులు జరిపాడు. తనను కాల్చవద్దంటూ సందేశ్ వేడుకున్నా వారు వినలేదు.
ఆ తర్వాత మౌంటీ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో నరికాడని ఆ సమయంలో గదిలో ఉన్న సందేశ్ రూమ్మేట్ నదీమ్ వివరించాడు. ఈ ఘాతుకాన్ని అడ్డుకోడానికి వెళ్లిన తనను కూడా కాల్చుతామంటూ బెదిరిస్తూనే గొడ్డలితో నరకడానికి ముందుకు రాగా, లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నానని, దాంతో తాను బతికిపోయాయనని తెలిపాడు.
సంఘటన జరిగిన సమయంలో మరో రూమ్మేట్ మధు పాలప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లాడని, అంతకుముందు తమను కలువడానికి వచ్చిన ప్రత్యూష్ కూడా ఆ సమయంలో గదిలోనే ఉన్నాడని నదీమ్ వివరించాడు. వేర్వేరు కోర్సులు చదువుతున్నందున చదువులో సైతం పోటీ అనే ప్రస్తావనే రాలేదని, కళాశాలలో సైతం ఎలాంటి ద్వేషం లేదని తెలిపాడు.
సంఘటన జరగగానే దిగ్భ్రాంతికి గురైన నదీమ్, మధులు వెంటనే అపార్టుమెంట్ యజమానికి తెలిపారు. అతడు నల్లగొండలోని సందేశ్ తండ్రి శ్యామ్సుందర్కు సమాచారం చేరవేశారు. నల్లగొండ కో ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న శ్యామ్సుందర్ ఈ వార్త తెలుసుకున్న వెంటనే శనివారం రాత్రి నోయిడాకు చేరుకున్నారు. ఆదివారం పోస్టుమార్టం పూర్తిఅయిన అనంతరం మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు.
పరారీలో అమన్, మౌంటీ
కాల్పులు జరిపిన అమన్, మౌంటీ పరారీలో ఉన్నారని దర్యాప్తు అధికారి జహీర్ఖాన్ తెలిపారు. వారిద్దరూ హర్యానాలోని పానిపట్టుకు చెందినవారని, అమన్ విద్యార్థి అని, అతడి మౌంటీ వివరాలు తెలియవని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం ఏ రకం తుపాకీతో కాల్పులు జరిపారన్న వివరాలు తెలుస్తాయని చెప్పారు. హత్యకు గల కారణాలపై ప్రత్యక్ష సాక్షి నదీమ్ను ఇప్పటికే ప్రశ్నించామని, తోటి విద్యార్థి మధు, ప్రత్యూష్ తదితరులను పిలిచి విచారణ చేపడామని తెలిపారు.
శ్యాంసుందర్ పెద్ద కుమారుడు సంతోష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, చిన్నవాడు సందేశ్ (19) నోయిడాలో చదువుకుంటున్నాడు. సందేశ్ మృతదేహాన్ని నోయిడా నుంచి ఢిల్లీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అక్కడనుంచి బంధువులు మృతదేహాన్ని హైదరాబాద్లోని తన బాబాయి రవిచంద్ర ఇంటికి ఆదివారం రాత్రి తరలించారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీనగర్ సమీపంలోని అలకాపురి కాలనీలో అంత్యక్రియలు జరిపారు.