యువకుడిని చంపించిన ప్రియురాలి తల్లి
అదిలాబాద్: ఓ యువకుడిని అతను ప్రేమించిన యువతి తల్లి చంపించిన సంఘటన అదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. యువకుడు ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు ఆ తల్లి ఆక్షేపించలేదు. యువకుడు అప్పులపాలు కావడంతో తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక హత్య చేయించింది.
సంఘటన వివరాలను కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ ఆదివారం వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లాపాడుకు చెందిన అశోక్ ఆర్మూర్లో ఉంటూ పక్కింట్లో ఉండే ఓ యువతితో 14 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. యువతి తల్లి బాల్కొండ నియోజకవర్గంలోని ఓ గురుకుల పాఠశాలలో స్వీపర్గా పని చేస్తోంది.
కొన్నాళ్లుగా అశోక్ ఆర్థికంగా చికితిపోవడం, తన కూతురుకి అశోక్తో కులాంతర వివాహానికి ఇష్టపడని తల్లి అశోక్ను చంపించేందుకు నిశ్చయించుకుని తన దగ్గరి బంధువైన రాజేందర్తో బేరం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లోని ఓ ఫౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్న అశోక్కు బాకీ ఇస్తానని రాజేందర్తో ఫోన్ చేసి నందిపేటకు రప్పించాడు.
రాజేందర్ తన స్నేహితుడైన గంగాధర్తో కలిసి అశోక్ను ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. వారిద్దరు మద్యం తాగి అశోక్ తలపై రాజేందర్ కర్రతో కొట్టడంతో కిందపడిపోయాడు. గంగాధర్ పార, గడ్డపారతో అశోక్ తలపై కొట్టి చంపేశారు. అనంతరం అక్కడే గొయ్యి తీసి అశోక్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
అశోక్ కోసం బంధువులు గాలిస్తూ, అశోక్ తాను కామారెడ్డి వెళ్తున్నట్లు ఫౌల్ట్రీ ఫాంలో పని చేసే వారితో చెప్పి వచ్చాడని కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ హత్యకు గురైనట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడు రాజేందర్ను రిమాండ్కు పంపామని, మరో ఇద్దరు నిందితులు విజయ, గంగాధర్ పరారీలో ఉన్నారన్నారు.