పారిపోయి వచ్చి.. యాదగిరిగుట్ట లాడ్జీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
నల్గొండ: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించిన నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రేమజంట. ఈ ఘటన నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.
పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి ఓడీఏఫ్ కాలనీకి చెందిన శ్రీమన్నారాయణ (21), శ్రీవాణి (19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరివి వేర్వేరు కులాలు. దీంతో వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 15 రోజుల క్రితం ఇళ్లను వదిలొచ్చారు.
చేతుల్లో డబ్బులు లేకపోవడం, కుటుంబసభ్యులు వెతుకుతున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకొని ఓ లాడ్జీలో బస చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
నొప్పి భరించలేక 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.