కెసిఆర్ను కలిసిన ఖమ్మం మున్సిపల్ ఛైర్పర్సన్: 28న టిఆర్ఎస్లో చేరికలు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ మడత రమ దంపతులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును గురువారం అధికారిక నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా నవంబర్ 28న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మడత రమ దంపతులతో పాటు 20 మంది కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాగా, వీరు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాయకత్వం మీదున్న విశ్వాసంతో ఇల్లందు ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు.
ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలి: మంత్రి ఈటల
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసు విచారణ నిమిత్తం మంత్రి గురువారం ఖాజీపేట రైల్వే కోర్టుకు హాజరైయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
‘కేంద్రం తెలంగాణ ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలి. వరంగల్ తీర్పుతో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పారు. ఇకనైనా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలి. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నయి. వరంగల్ ప్రజలు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోలేదు' అని తెలిపారు.
‘సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలిచారు. కేంద్రం మెడలు వంచైనా పత్తికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషిచేస్తం. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి' అని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.