నాటకీయ పరిణామాల మధ్య ఒక్కటైన మధుప్రియ-శ్రీకాంత్
ఆదిలాబాద్: శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలు సాయంత్రం నాటికి ముగిశాయి. ‘ఆడపిల్లనమ్మా' అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్ధమాన గాయని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వైభవంగా జరిగింది.
కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే సిర్పూర్ కాగజ్నగర్లోని వాసవీ గార్డెన్స్లో తన అభీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది.
అనూహ్య మలుపులతో ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కడంతో శుక్రవారం ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.
అంతకుముందు పరిణామాలను పరిశీలించినట్లయితే.. శుక్రవారం ఉదయం పోలీస్స్టేషన్ చేరుకున్న మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మధుప్రియ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు నో చెప్పారు. పోలీసుల కౌన్సెలింగ్లో మధుప్రియ... ఎట్టి పరిస్థితుల్లోను తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.
ఆమె మేజర్ అయినందు వల్ల తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. దీంతో మధుప్రియ ప్రేమపెళ్లికి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం ఉదయం నుంచి మధుప్రియ, తల్లిదండ్రులు కాగజ్ నగర్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా మధుప్రియ వినలేదు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు.
కెరీర్ పైన దృష్టి పెట్టాలని మధుప్రియ తండ్రి తన కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె అసలు వినలేదు. ఆ తర్వాత నవంబర్ 18న పెళ్లి చేసేందుకు అంగీకరించారు. అయితే, తాను వెంటనే శ్రీకాంత్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, ఉదయం పదకొండున్నర గంటలకు కావాల్సిన పెళ్లి... మధ్యాహ్నం తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్లోని వాసవీ గార్డెన్స్లో జరిగిపోయింది.