'మగ వ్యభిచారులు'... లేడీ టెలికార్స్తో ట్రాప్.. ముగ్గులో దిగితే అంతే సంగతి...
ఓ డేటింగ్ వెబ్సైట్లో 'మగ వ్యభిచారులు' కావలెను అని ప్రకటన ఇచ్చిన ఓ ముఠా... పలువురు అమాయక నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. మహిళలతో ఫోన్లు చేయించి... వారిని నమ్మించిన ముఠా... ఆయా పన్నుల పేరిట వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఇటీవల హైదరాబాద్కి చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగుచూసింది. స్పెషల్ ఆపరేషన్తో ఈ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం(నవంబర్ 21) ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఇలా అట్రాక్ట్ చేస్తారు...
సీపీ కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ వెబ్సైట్లో ఉన్న 'మేల్ ఎస్కార్ట్'(మగ వ్యభిచారులు) ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. దీంతో ఆ సైట్లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. అనంతరం అందులోకి లాగిన్ అయ్యాడు. ఆ తర్వాత సదరు వెబ్సైట్ నిర్వాహకుల నుంచి అతనికి ఫోన్ కాల్స్ వచ్చాయి. వీఐపీ మెంబర్షిప్,జీఎస్టీ,రకరకాల ప్యాకేజీల పేరిట అతన్ని మరింత ఆకర్షించారు. దీంతో గుడ్డిగా నమ్మేసిన ఆ వ్యక్తి పలు దఫాలుగా రూ.13.82లక్షలు చెల్లించాడు.
ఇలా వెలుగులోకి...
అంత డబ్బు చెల్లించాక కూడా.. చివరకు మరో రూ.1.5లక్షలు చెల్లించాలని అతనిపై వెబ్సైట్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఎక్కడో తేడా కొడుతున్నట్లు గ్రహించిన అతను... తాను మోసపోయానని తెలుసుకున్నాడు. దీంతో సెప్టెంబర్ 18న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. షాద్నగర్కి చెందిన మరో బాధితుడు కూడా ఇలాగే మోసపోయాడు. దీంతో ఆ ముఠాను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ స్పెషల్ టీమ్ను రంగంలోకి దింపారు.
ముగ్గురి అరెస్ట్...
సెల్ఫోన్ సిగ్నల్స్,బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆ ముఠా బెంగాల్లో నేపాల్ సరిహద్దుకు సమీపంలోని సిలిగురి పట్టణం కేంద్రంగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన స్పెషల్ టీమ్... మూడు రోజులు అక్కడే మకాం వేసి రెక్కీ నిర్వహించారు. సదరు ముఠా నిర్వహిస్తున్న కాల్సెంటర్లపై దాడులు చేసి బిజయ్ కుమార్,బినోద్ కుమార్ షా,మహమ్మద్ నూర్ ఆలం అన్సారీ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తరలించారు.
Recommended Video
పరారీలో ప్రధాన నిందితులు...
ఆ వెబ్సైట్ నిర్వాహకులు మరికొన్నిచోట్ల కూడా కాల్ సెంటర్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది మహిళలను టెలీకాలర్స్గా నియమించుకున్నట్లు గుర్తించారు. మాటలతోనే వ్యక్తులను ఆకర్షించేలా వారికి శిక్షణ ఇచ్చి అమాయక నిరుద్యోగులకు గాలం వేస్తున్నట్లు నిర్దారించారు. ఇప్పటివరకూ ఎంతోమంది అమాయకుల నుంచి రోజుకు రూ.1కోటి చొప్పున ఆ గ్యాంగ్ కాజేసినట్లు గుర్తించారు. అంతేకాదు,ఆ గ్యాంగ్ ఇలాంటిదే మరో వెబ్సైట్ కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీని వెనకాల ప్రధాన సూత్రధారులైన సంతు దాస్,అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ,సుషాంక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.