అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ: తెలంగాణ పార్టీ బాధ్యతలు ఖాయమే?
న్యూఢిల్లీ: బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షాను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను నియమించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.
కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మారుస్తుందా? లేక సంస్థాగత బలోపేతం తర్వాత మారుస్తారా? అనేది త్వరలోనే తేలిపోనుంది.

మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు ఢిల్లీలో ఉండి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత సునీత మహేందర్ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలిచినా వారు రాజకీయపరంగా అత్యున్నత శిఖరాలకు వెళ్తారనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈటలకు స్టేట్ ప్రెసిడెంట్ పదవి కట్టబెడితే ఈ ఆనవాయితీ కొనసాగినట్లవుతుంది.
ఇది ఇలావుంటే, కిషన్ రెడ్డి సారథ్యంలో శాసనసభ, సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ మంచి సీట్లు, ఓట్లు సాధించింది. రెండోసారి మోడీ మంత్రివర్గంలో కిషన్ రెడ్డి ఎంపిక కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటలకు ఈ బాధ్యతలు కట్టబెడతారని సమాచారం. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహిస్తున్నారు. దీంతో తాజాగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారనే చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications