హైదరాబాద్లో దారుణం: బాలికలకు మత్తు ఇచ్చి.. అత్యాచారం, ఆపైన వ్యభిచారం!
హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలను నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ వారికి బలవంతంగా మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడడమేకాక వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కామాంధుడి బండారం ఓ బాధిత బాలిక ఫిర్యాదుతో బట్టబయలైంది. అనేకమంది బాలికలు వీడి ఉచ్చులో చిక్కుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. బాధితుల్లో నిందితుడి కుమార్తె కూడా ఉండడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
నమ్మించి ఇంటికి తీసుకెళ్లి...
హైదరాబాద్ యూసఫ్గూడ బస్తీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తె స్నేహితురాళ్లు, పరిచయం ఉన్న బాలికలపై కన్నేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లేవాడు. అక్కడ వారికి మత్తుమందు కలిపిన పానీయాలు తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.
కన్నకూతురిపైనా అత్యాచారం...
నిందితుడు తన కడుపున పుట్టిన కూతుర్నీ వదల్లేదు. ఓ రోజు మత్తుమందు కలిపిన పానీయం తాగించి ఆ బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. తన ఇంటికి విటులను తీసుకొచ్చి ఆమెను వారికి అప్పగించేవాడు. ఇలా వాడిచేతిలో ఇప్పటి వరకు ఓ పదిమంది మైనర్ బాలికలు బలైపోయినట్లు తెలుస్తోంది.
కృష్ణానగర్కు చెందిన బాలికను...
వారం రోజుల కిందట ఈ కామాంధుడు పని ఇప్పిస్తానంటూ కృష్ణానగర్కు చెందిన ఓ బాలిక(10)ను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికను బంధించి, మత్తుమందు కలిపిన పానీయం తాగించి లైంగికంగా వేధించాడు. తమ కుమార్తె కనిపించకపోవడంతో వారం రోజులుగా ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది.
ఇలా గుట్టు రట్టు...
చివరికి స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ కామాంధుడి గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంట్లోంచి తమ కుమార్తెను విడిపించుకుని తీసుకొచ్చేశారు. ఆ తరువాత కాసేపటికి నిందితుడు వారి ఇంటికి వెళ్లగా స్థానికుల సాయంతో అతడ్ని నిర్బంధించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి అతడ్ని తమ అదుపులోనికి తీసుకున్నారు.
స్పృహలోకి రాకుండా మత్తుమందు ఇస్తూ...
వారం రోజులుగా ఆ కామాంధుడి చెరలో ఉన్న తమ కుమార్తె చెప్పింది విని ఆమె తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. పని చూపిస్తాను రమ్మంటూ తనను తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, స్పృహలోకి వస్తుండగానే మళ్లీ మత్తుమందు ఇచ్చి స్పృహ పోగొట్టేవాడని, ఆదివారం వరకు ఇలాగే చేశాడని బాధిత బాలిక వాపోయింది.
వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి...
ఆ కామాంధుడు తన కూతుర్ని కూడా వదల్లేదని, ఆమెనూ వ్యభిచారం చేయమంటూ హింసించే వాడని, తాను కూడా ఈ వారం రోజులు నరకం అనుభవించానని బాధిత బాలిక పోలీసులకు వివరించింది. తమను బయటికి వెళ్లనివ్వకుండా ఇంట్లోని బంధించి ఉంచేవాడని, విటులను తీసుకొచ్చి వారికి సహకరించాలంటూ హింసించేవాడని వాపోయింది.