రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి: మృతుడు గుంటూరువాసి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా వలిగొండ- నాగారం స్టేషన్ల మధ్య నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని గుంటూరుకు చెందిన పాతికేళ్ల సాంబయ్యగా గుర్తించారు.
ఈ సంఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వేపోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున జరిగింది. గుంటూరుకు చెందిన సాంబ సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు తన మిత్రుడితో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరాడు.
ప్రయాణం సమయంలో మిత్రులిద్దరు మాట్లాడుకుంటూ రైలు మెట్ల మీద కూర్చుకున్నారు. అయితే, రైలు వలిగొండ సమీపానికి వచ్చేసరికి ఇద్దరు కూడా రైల్లోంచి జారిపడ్డారు. దీంతో సాంబయ్య అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన మిత్రుడిని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు.