మహిళా ఎస్ఐకి భర్త పాద పూజ.. హైదరాబాద్లో ఆసక్తికర ఘటన..
కరోనా వైరస్పై పోరులో వైద్యులు,పోలీసులు,పారిశుద్ద్య కార్మికులు సైనికుల్లా ముందుండి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ వారు అందిస్తున్న సేవలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల పారిశుద్ధ్య కార్మికులపై బాల్కనీల్లో నుంచి పూలు చల్లిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలు సైతం పారిశుద్ద్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానం చేశారు.
అలాగే దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు,పోలీసులకు కూడా పాద పూజలు నిర్వహిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సంధ్యకు ఆమె భర్త పాద పూజ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నందుకు ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సంధ్య మాట్లాడుతూ.. తన భర్త సహాయ సహకారాల వల్లే విధులు నిర్వహించగలుగుతున్నానని తెలిపారు. పోలీసుల సేవలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్కు ప్రజల సహకారం బాగుందని.. దాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పారు. ప్రజల కోసం కుటుంబాలను కూడా పక్కకు పెట్టి తాము విధుల్లోకి వస్తున్నామని.. కాబట్టి ప్రజలకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.