Crop Loan Waiver: రుణ మాఫీ కాలేదని రైతుల ఆందోళన.. లైట్ తీసుకుంటున్న ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదని ఆందోళనకు దిగుతున్నారు. రుణ మాఫీకి రూ.31 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టిన ప్రభుత్వం రూ.17 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీనిపై వారు ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణ మాఫీ చేస్తారని కాంగ్రెస్ కు ఓటు వేస్తే నట్టేట ముంచారని అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని ఇండియన్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు 300 మంది రైతులు తమకు రుణ మాఫీ కాలేదని చెబుతున్నారు. ఏఈఓను కలిసినా.. ఏఓను కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వివరాలు సరిగా ఉన్నా.. రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేవుళ్లపై ఒట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి చివరికి రుణ మాఫీ చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. పూర్తిగా రుణ మాఫీ చేయలేదని గాని హరీశ్ రావు రాజీనామా చేయమంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రుణ మాఫీ కాలేదని తమకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇటు బీజేపీకి కూడా భారీ సంఖ్యలో రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రుణ మాఫీ వట్టి బోగస్ అని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఇప్పటికీ దాదాపు సగం మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే భవిష్యత్ లో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో పంట నష్ట పరిహారం విడుదల చేసిన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ చేయలేదని పలువురు రైతులు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications