ట్విస్ట్ ల మీద ట్విస్ట్: కారులో శిరీష, రాజీవ్ మధ్య ఏమైంది, ప్రభాకర్ రెడ్డికి 20 మెమోలు?
హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో తెరమీదికి వచ్చిన బ్యూటీషీయన్ శిరీష మృతిపై అనేక సందేహలు వ్యక్తమౌతున్నాయి. ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారంగా ఆమె ఒంటిపై గాయాలున్నట్టుగా చెబుతున్నారు. దీంతో పోలీసులు హత్య కోణంలో కూడ విచారణ చేస్తున్నారు.
బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు లింకుందనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి ఆత్మహత్యలకు సంబంధించి అంతులేని ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. అయితే ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
రాజీవ్, శ్రవణ్ లను వేర్వేరుగా విచారించారు. గురువారం నాడు మధ్యాహ్నం వీరిద్దరిని కుకునూర్ పల్లికి తీసుకెళ్ళారు. సోమవారం నాడు కుకునూరుపల్లిలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు వీరిద్దరిని విచారించారు.
బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య చేసుకొందని తొలుత భావించారు. అయితే ఆమె భర్త సతీష్ చంద్ర, తల్లి కూడ శిరీష ఆత్మహత్య చేసుకొనేంత పరికిది కాదని చెప్పారు. ఇదిలా ఉంటే ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై కూడ సోషల్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారం సాగుతున్నాయి. ప్రభాకర్ రెడ్డిది కూడ ఆత్మహత్య కాదనే అనుమానాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
శిరీష శరీరంపై గాయాలు ఎలా అయ్యాయి?
బ్యూటీషీయన్ శిరీష శరీరంపై గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రాధమిక నివేదిక పోలీసులకు చేరింది. అయితే ఈ నివేదిక మీడియాకు బహిర్గతమైంది. ఈ నివేదికలో బ్యూటీషీయన్ శిరీష శరీరంపై గాయాలున్నట్టు తేలింది. ఇదే విషయాన్ని శిరీష తల్లి కూడ పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా వద్ద ప్రస్తావించారు. శిరీష ఆత్మహత్య చేసుకొంటే ఆమె శరీరంపై గాయాలు ఎలా అయ్యాయనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఆమెపై దాడి చేయడంతో చనిపోయిందా ?అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెడపై ఒత్తిడి కారణంగానే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుడికన్ను కమిలిపోయి ఉందని, పెదవులపై గాయాలున్నాయని,తల వెనుక భాగంలో కూడ గాయాలున్నట్టుగా వైద్యులు పోస్ట్ మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడించినట్టు సమాచారం.
కుకునూర్ పల్లిలోనే శిరీష, రాజీవ్ కు మధ్య ఘర్షణ?
కుకునూర్ పల్లిలోనే శిరీష, రాజీవ్ కు మధ్య ఘర్షణ చోటుచేసుకొందంటున్నారు. ఈ విషయమై అసలు ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకొనేందుకు ఆరోపణలు ఎదుర్కోంటున్న రాజీవ్, శ్రవణ్ లను సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న వారిని కుకునూర్ పల్లి తీసుకెళ్ళాడు. అక్కడే వారిని విచారించారు. ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లోనే రాజీవ్, శిరీషకు మద్య గొడవ ప్రారంభమైందనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ గొడవతో ప్రభాకర్ రెడ్డి వారిని వెళ్ళిపోవాలని ఆదేశించినట్టు సమాచారం.
హైద్రాబాద్ కు తిరిగివస్తుండగా ఏం జరిగింది?
కుకునూర్ పల్లి నుండి తిరిగి వస్తుండగా బ్యూటీషీయన్ శిరీష తన భర్తకు వాట్సాప్ లో తాను షామీర్ పేట పరిధిలో ఉన్నట్టుగా అర్ధరాత్రి 1.40 నిమిషాలకు లోకేషన్ ను షేర్ చేసింది. అయితే వెంటనే భర్త ఆమెకు ఫోన్ చేయడంతో ఆమె నుండి స్పందన రాలేదని ఆయన మీడియాకు చెప్పారు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు కూడ ఆమెకు ఫోన్ చేసినా ఫోన్ నుండి స్పందన రాలేదని ఆయన వివరించారు. అయితే కుకునూర్ పల్లి నుండి హైద్రాబాద్ కు కారులో తిరిగివస్తుండగా ఏం జరిగిందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.కారులోనే రాజీవ్, శ్రవణ్ లు ఆమెపై దాడి చేశారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. అయితే హైద్రాబాద్ కు తిరిగివస్తుండగా ఆమె రెండుసార్లు కారునుండి దిగేందుకు ప్రయత్నించిందని రాజీవ్,శ్రవణ్ లు పోలీసులకు చెప్పారు. అయితే రెండుసార్లు ఆమె కారునుండి ఎందుకు దిగాలని ప్రయత్నించిందో తేలాల్సి ఉంది.
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై కూడ అనుమానాలు
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై కూడ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.ఆత్మహత్య చేసుకొనేముందు ప్రభాకర్ రెడ్డి సూసైడ్ నోట్ రాసి ఉంటారని కుటుంబసభ్యులు బలంగా అభిప్రాయంతో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి షర్ట్ జేబు తెరిచి ఉండడాన్ని బట్టి కుటుంబసభ్యులు, సన్నిహితులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి తల ఇరువైపులా నుండి రక్తం ధారలు కారాయి. కానీ, ఎడమమైపు రక్తం కిందివరకు కారినట్టుగా ఆనవాళ్ళు ఉండగా, కుడివైపు మాత్రం రక్తం ఆ జేబు బటన్ వరకు వచ్చి ఆగడం తరవాత మళ్ళీ రక్తపు చారలు ఉండడం పట్ల వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడ టెక్నికల్ అంశాలు. శాస్త్రీయంగా వీటిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. లోతుల్లోకి వెళ్ళకుండా పైపైనే అంచనాలకు రావాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
45 రోజుల్లో 20 మోమోలు?
ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి తనకు చెప్పాడని భార్య రచన మీడియాకు చెప్పారు. అయితే కుకునూర్ పల్లి నుండి బదిలీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ములుగు పోలీస్ స్టేషన్ కు నెలరోజుల్లో బదిలీపై వెళ్ళాల్సి ఉందన్నారామె. 45 రోజుల్లో 20 మోమోలు ఇచ్చారని ఆయన ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నట్టు తోటి సిబ్బందికి చెప్పారని అంటున్నారు.ఉన్నతాధికారులు వేధించేవారని ప్రభాకర్ రెడ్డి సతీమణి చెబుతున్నారు.
విచారణాధికారి ఎవరు?
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారి ఎవరనే ప్రశ్నలు కూడ లేవనెత్తుతున్నారు ఆయన కుటుంబసభ్యులు. ఈ ఘటనపై విచారణాధికారిగా అడిషనల్ డిజి గోపాలకృష్ణను నియమించినట్టుగా డిజిపి అనురాగ్ శర్మ ప్రకటించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ కేసును సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్, శ్రవణ్ లను ఆయన విచారించారు. అయితే ఈ కేసులో విచారణాధికారి ఎవరనే విషయంపై వారు అంతుచిక్కని ప్రశ్నలు వేధిస్తున్నాయి.