ఏషియన్ పెయింట్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం: మూడంతస్తుల్లో మంటలు, రైళ్లకు అంతరాయం
హైదరాబాద్: సికింద్రాబాద్లోని రాణిగంజ్లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాణిగంజ్లోని ఏసియన్ పెయింట్స్ డీలర్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే భవనంలోని మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి.
భారీగా ఎగసిపడుతోన్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో దూరంగా పరుగులు తీశారు. ఈ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్ధాలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది.
పెయింట్ డబ్బాలు పేలుతుండటం, ఎలక్ట్రికల్ సామగ్రి ఉండటంతో అంటుకొని మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో మరిన్ని అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చిన్న గల్లీ కావడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, దుకాణాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అధికారులు లోకల్ ట్రైన్స్ను నిలిపేశారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.