చంద్రబాబు, కెసిఆర్ రాజీకి మధ్యవర్తి ఎవరో మాకు తెలుసు: షబ్బీర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు మధ్య ఒప్పందం కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించిందో ఎవరో తమకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు మధ్యవర్తి పేరు బయటపెడుతామని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనను తప్పు పట్టిన ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అడిగారు. విభజన హామీలను మోడియే కాదు ఎవరు ప్రధానిగా వచ్చినా అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు, కెసిఆర్లేనని ఆయన అన్నారు. అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ హాజరు కావడం సంతోషకరమని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం నిరాశపరిచిందని ఆయన అన్నారు. ఎపి, తెలంగాణలకు నరేంద్ర మోడీ ఏవైనా హామీలు ఇస్తారని అనుకున్నామని, కానీ ఏమీ ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రస్తావించకపోవడం సరి కాదని అన్నారు.
రైతుల ఆత్మహత్యలపై నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు నోరు రాలేదని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అననారు. పదేళ్లు ఎపికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్య నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. ప్రధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మంచి సంకేతాలు ఇస్తారని అనుకున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను మోడీ తప్పు పట్టడం పార్లమెంటును అవమానపరచడమేనని ఆయన అన్నారు. విభజనను మోడీ తప్పుపట్టడాన్ని కెసిఆర్ ఎందుకు ఖండించలేదని ఆయన అడిగారు. పోలవరం ముంపును చంద్రబాబు హర్షిస్తే కెసిఆర్ చప్పట్లు కొట్టారని ఆయన విమర్శించారు. ఎపిలో అమరావతి సినిమా, తెలంగాణలో బంగారు తెలంగాణ సినిమాలు నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.