హైదరాబాద్లో మిలద్ ఉత్సవాలు వాయిదా
Milad-un-Nabi: హైదరాబాద్లో మిలద్-వున్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. 19వ తేదీన ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అంగీకరించింది.
హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమౌతాయి. 17వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత వైభవంగా వినాయక చవిత పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది హైదరాబాద్లో.
16వ తేదీ నాడే మిలాద్-వున్- నబి పండగ రావడం, అదే రోజున హైదరాబాద్లో భారీ ఎత్తున మహ్మద్ ప్రవక్త ప్రదర్శనలను నిర్వహించాల్సి రావడం వల్ల ప్రభుత్వం రంగంలోకి దిగింది.
మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మిలద్ వేడుకల నిర్వహణ కమిటీ సానుకూలంగా స్పందించింది. 19వ తేదీన ఈ ఉత్సవాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. మహ్మద్ ప్రవక్త 1,499వ జయంతి వేడుకలను సెప్టెంబర్ 16వ తేదీనాడే ఘనంగా నిర్వహిస్తామని తెలిపింది.
2025లో మహ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించేందుకు అనుమతించాలని మిలాద్ ఉన్ నబీ కమిటీ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. జిల్లా కేంద్రాల్లో మసీదుల అలంకరణ, ఊరేగింపులకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications