అదే అదునుగా భావించి.. : మంత్రి దత్తాత్రేయ సెల్ ఫోన్ దొంగను పట్టేశారు
ముషీరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సెల్ ఫోన్ ని దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుమ్మడి రాజ్(52) కుమార్ అనే సరూర్ నగర్ కి చెందిన వ్యక్తి ఈ చోరికి పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలంలో దర్శనం పాస్ ల నిమిత్తమై గుమ్మడి రాజ్ కుమార్ ఈనెల 15 వతేదీన రామ్ నగర్ లోని దత్తాత్రేయ ఇంటి వెళ్లాడు. అయితే అంతకుముందు రోజు రాత్రి వీచిన బలమైన గాలుల ప్రభావంతో దత్తాత్రేయ నివాసముంటున్న ప్రాంతంలో చెట్లు విరిగి పడడంతో ఆయన నివాసములోను విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే క్రమంలో చార్జింగ్ కోసమై దత్తాత్రేయ తన సెల్ ఫోన్ ను ఆయన ఇంటి ముందు ఉన్న ఓ గదిలో ఉంచారు.
అదే సమయంలో మంత్రి దత్తాత్రేయ ఇంటి వద్ద సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉండటం నిందితుడు రాజ్ కుమార్ కి కలిసొచ్చింది. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండడాన్ని గమనించిన రాజ్ కుమార్ అదే అదునుగా భావించి ఎవరికి అనుమానం రాకుండా మొబైల్ ఫోన్ ను కొట్టేశాడు.
కాసేపటి తర్వాత మొబైల్ కోసం వెతగ్గా, ఎక్కడా కనిపించపోవడంతో మంత్రి దత్తాత్రేయ పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.