కర్ణాటకలోనే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. తెలంగాణాలో ఇవ్వరా? మోడీని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకొని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఉచిత పథకాలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బిజెపి నేతలు కర్ణాటక రాష్ట్రంలో పాలు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలకు మూడు సిలిండర్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వరని మంత్రి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో మూడు సిలిండర్లు ఫ్రీ అని ప్రధాని చెప్పారని ఆయన కర్ణాటక రాష్ట్రానికి ప్రధానినా, లేక దేశానికి ప్రధానినా చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.ఇప్పటివరకు ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదని పదే పదే చెప్పి ఇప్పుడు కర్ణాటకలో మూడు సిలిండర్లు ఉచితమని చెప్పడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు.

అదానీ కొన్న ఎయిర్ పోర్టుకు జిఎస్టి ఉండదు కానీ పాలు, పెరుగులపై జిఎస్టి వేసిన ఘనుడు ప్రధాని నరేంద్రమోడీ అంటూ మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టారుకు 25వేల రూపాయల పరిహారం ఇస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ముస్తాబాద్ మండలం గోపాల రావుపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా, వీర్నపల్లి మండలంలో క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు. వడగళ్ళ వర్షం, అకాల వర్షాలకు నేలరాలిన వరి గింజలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కుప్పలను మంత్రి పరిశీలించారు.
రైతులు అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి కేసిఆర్ పై నమ్మకం ఉంచండి అని అన్నారు.దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.












Click it and Unblock the Notifications