మీతో మాకేం పంచాయితీ.. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని పేర్కొన్నారు. ఆమెకు ఆమె ఊహించుకుంటే తామేమీ చేయలేమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గవర్నర్కు ఎక్కడ అవమానం జరిగింది? కేటీఆర్ ప్రశ్న
పాడి కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించడంపై కేటీఆర్ స్పందించారు. పొలిటికల్ లీడర్ గా ఉన్న మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా అంటూ కేటీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను నిలదీశారు. తమకు గవర్నర్ అంటే గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. గవర్నర్కు ఎక్కడ అవమానం జరిగింది.. ఎవరు ఎవర్నీ అవమానించారు ? అని ఆయన ప్రశ్నించారు.

గవర్నర్.. గవర్నర్ గా వ్యవహరిస్తే గౌరవిస్తాం
గవర్నర్...గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం అని పేర్కొన్న కేటీఆర్ గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయతీ ఉంటుంది. కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు అవమానిస్తారా? అని గవర్నర్ చెప్పినట్లు విన్నానని పేర్కొన్న ఆయన కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డు వచ్చిందా? తమిళిసై గారు గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు, వారికి గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా? అంటూ ప్రశ్నించారు.

ప్రతీది గవర్నర్ అవమానంగా తీసుకుంటే మేము చేయగలిగిందేమీ లేదు
గవర్నర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ అన్నీ ఎందుకు ఊహించుకుంటున్నారు అని ప్రశ్నించారు. నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు మాకు ఎలాంటి పంచాయతీ లేదు, గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం అని మంత్రి పేర్కొన్నారు. శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది కానీ సమావేశం ప్రొరోగ్ కానందుకే గవర్నర్ ప్రసంగం లేదు అని పేర్కొన్నారు. గవర్నర్ అవమానంగా తీసుకుంటే మేము చేయగలిగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు?
తాము ఎక్కడ గవర్నర్ ను అవమానించేలా ప్రవర్తించలేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధించాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ కాకముందు తమిళిసై ఏ పార్టీలో నాయకురాలు అనేది అందరికీ తెలుసు అని పేర్కొన్న మంత్రి గతంలో రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తుందో ఆమె ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.

అవమానిస్తున్నారని గవర్నర్ వ్యాఖ్యలు.. స్పందించిన మంత్రి కేటీఆర్
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ మరోమారు టిఆర్ఎస్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని పేర్కొన్న ఆమె తాను అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని అని వెల్లడించారు. రాజ్ భవన్, గవర్నర్ ను కావాలని అవమానిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమిళిసై ని కాకున్నా, రాజ్ భవన్ ను అయినా గౌరవించాలని, ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా అంటూ గవర్నర్ తమిళ సై మరోమారు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పై తనకు ఎలాంటి కోపం లేదని పేర్కొన్న ఆమె, రాష్ట్రంలో పరిణామాలపై ప్రధాని, హోం మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. తమిళిసై వ్యాఖ్యల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఆమె వ్యాఖ్యలపై స్పందించారు.












Click it and Unblock the Notifications