మజ్లిస్ పొత్తు లేకుండానే మేయర్ పీఠం.: గ్రేటర్ ఫలితాలపై కేటీఆర్ పోస్టుమార్టం, భారత్ బంద్కు సపోర్ట్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు డిసెంబర్ 8న భారత్ బంద్లో పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గ్రేటర్ పరిధి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
గ్రేటర్ ఫలితాలు.. ఇక్కడే లెక్క తప్పింది..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలన్నారు. గ్రేటర్లో మన ప్రయత్న లోపం లేదని, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని టీఆర్ఎస్ నేతలతో అన్నారు. సిట్టింగ్లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్లను మార్చని చోట ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక్కడే లెక్క తప్పిందన్నారు.
భారత్ బంద్కు పూర్తి మద్దతు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని ఎమ్మెల్యేలతో కేటీఆర్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. డిసెంబర్ 8న భారత్ బంద్ విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలన్నారు కేటీఆర్.
ఢిల్లీ పెద్దల దిమ్మదిరిగేలా..
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. బంద్ను విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. డిసెంబర్ 8న వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్లో పాల్గొన్నాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త 2 గంటల పాటు బంద్ పాటించాలని, ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం కావాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Recommended Video
మజ్లిస్ పొత్తు లేకుండానే మేయర్ పీఠం..
మరోవైపు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ పోస్టుమార్టం నిర్వహించారు.అనంతరం ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లతో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ పీఠంపై కార్పోరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో తిరిగి.. ప్రజల్లోనే ఉండాలని వారికి సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై కసరత్తులు చేశారు. ఎంఐఎంతో పొత్తు లేకుండానే పీఠం దక్కించుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు జీహెచ్ఎంసీ చట్టాలను పరిశీలిస్తున్నారని కేటీఆర్ వివరించారు.