అప్పుడేనా?. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి: హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విలువలు లేని హరీశ్ రావు తెలంగాణను దోచి మామకి కట్టపెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే తమ సర్కారుపై విమర్శలా? అని ప్రశ్నించారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. తిన్ని సొమ్మంతా కక్కిస్తామని మంత్రి పొంగులేటి.. హరీశ్ రావును హెచ్చరించారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన మీరా తమ ప్రభుత్వం గురించి మాట్లాడేది అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ తొమ్మిదేళ్లలో దోచి అప్పుల రాష్ట్రంగా మార్చిందని గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దోచుకున్న డబ్బులన్నీ మీ మామ(కేసీఆర్) దగ్గర పెట్టారని హరీశ్ రావునుద్దేశించి ఆరోపించారు పొంగులేటి.

రైతుబంధు పైసలు వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. తమ గురించి మాట్లాడటమేంటని పొంగులేటి మండిపడ్డారు. అప్పుడే ఏముంది ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టు కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం కావాలని మమ్మల్ని గెలిపించారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆరు గ్యారంటీలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారని తెలిపారు. తూతూ.. మమ.. అనుకోకుండా చెప్పిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పథకాలు అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. పదేళ్లు ఏమీ చేయనివారు తమను విమర్శించడం విడ్డూరమని బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
అసలు హరీశ్ రావు ఏమన్నారంటే..?
తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను ఎప్పుడు కొనుగోలు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తాము అధికారంలోకి వస్తే బోనస్ ఇచ్చి మరీ వడ్ల కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు వడ్లను అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు నిధుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు క్లారిటీ ఇవ్వాలని హరీశ్ రావు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. డిసెంబర్ 9న రైతుబంధు నిధులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. కానీ ఈ రోజు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. ఈ క్రమంలోనే పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications