కర్నూలులో ప్రమాదం జరిగిన బస్సు ఎవరిది - తప్పు ఎక్కడ, తేల్చిందేంటి..!?
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేసారు. ప్రమాదానికి గల కారణాల పైన విచారణ సాగుతోంది. అయితే, ఇదే సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు కీలక అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ బస్సు ఎవరిది.. అనుమతులు అన్నీ ఉన్నాయా.. ప్రమాదానికి కారణాల పైన ప్రాధమికంగా సమాచారం సేకరించారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రయివేటు బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ ప్రయివేటు బస్సులో అప్పర్ స్లీపర్ లో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది బస్సు కిటికీ అద్దాలను ఓపెన్ చేసి బయటకు వచ్చారు. కాగా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బస్సు ప్రమాదం పైన ఫోకస్ చేసాయి. ప్రధాని మోదీ బాధితులకు పరిహారం ప్రకటించారు.

కాగా.. ఈ బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందినది గా చెబుతున్నారు. వేమూరి వినోద్ అనే వ్యక్తి పేరు మీద ఈ బస్సు రిజిస్ట్రేషన్ జరిగింది. రాయగఢ కు చెందిన వినోద్ ఈ బస్సుకు కావాల్సిన అనుమతులు తీసుకున్నారు. ఆల్ ఇండియా పర్మిట్ తో ఈ బస్సు రాకపోకలు సాగిస్తోంది. రవాణా అధికారులు బస్సు ఫిట్ గానే ఉందని చెబుతున్నారు.
అయితే, తెలంగాణ రవాణా మంత్రి పొన్నం మాత్రం కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తాను ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీలతో మాట్లాడినట్లు వెల్లడించారు.
కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025
మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO
బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు ట్రావెల్స్ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం- ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు.












Click it and Unblock the Notifications