నీ మంగమ్మ శపథాలు నడవవిక్కడ!!
ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నట్టుగా కొనసాగుతున్నాయి. ఓ పక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ తో అనవసరంగా వైరం పెంచుకున్న వారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. వారిని ప్రజలు ఆదరించబోరని స్పష్టం చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఒకరు మంగమ్మ శపధాలు చేస్తున్నారని, అయితే అవేవీ నడవవన్నారు. ప్రజలు కచ్చితంగా బీఆర్ఎస్ నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపించి తీరుతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరితమైన డబ్బు రాజకీయాలు నడవవని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పైన, సంక్షేమం పైన విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కారేపల్లి మండలం చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు త్వరలోనే పది లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేస్తున్నారు.












Click it and Unblock the Notifications