అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్.. కేసీఆర్ ను సాదుకుంటారో.. సంపుకుంటారో మీ ఇష్టం!!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సీఎం కేసీఆర్ ను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
సత్తుపల్లి అభివృద్ధి విషయంలో ముందుండే వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య అని, ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఆయనను ఆదరించాలి అన్నారు. సండ్ర వెంకట వీరయ్య నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయనను సాదుకుంటే ప్రజలకు ఉపయోగపడతారని పేర్కొన్నారు. అలాకాకుండా సంపుకుంటే మీరే నష్టపోతారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రానికి పన్నులు చెల్లించి మనమే కేంద్రాన్ని సాదుతున్నామని పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల సమయం వస్తుందని కొందరు నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారని, ప్రజలకు ఏమీ చేయని నాయకులు, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారని.. వారితో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది ఎవరు అనేది అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
కరోనా సమయంలో లేని నాయకులు ఇప్పుడు వచ్చి కల్లబొల్లి ముచ్చట్లు చెబుతున్నారని అలాంటివారిని నమ్మొద్దని పేర్కొన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని చివరి ఎకరా వరకు సాగర్ జలాలు అందేలా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇంత చొరవ వేరే నాయకులకు ఉంటుందా అంటూ ప్రశ్నించారు.

కాకర కాయలు కూడా పంచని నేతలు ఎన్నికలు సమీపిస్తుండడంతో తగుదునమ్మా అంటూ వస్తున్నారని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపిస్తుంటే కొన్ని దుష్ట శక్తులు ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.












Click it and Unblock the Notifications