రేవంత్ ఓటుకు నోటు కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
కాంగ్రెస్ - బీజేపీ పైన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని, దీంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డేనని గుర్తుచేశారు. బీజేపీ బీసీ సీఎం ప్రకటనపైనా కేటీఆర్ స్పందించారు.
కాంగ్రెస్ పై కామెంట్స్ : కాంగ్రెస్ పైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందన్నారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని విమర్శించారు. తాము తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు మైగ్రేషన్కు కేరాఫ్గా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్కు కేరాఫ్గా మారిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ను బీఆర్ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు.

కర్ణాటకకు వెళ్దాం : తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకను మోడల్గా చూపిస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. కన్నడ రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క పైసా అప్పు చేసిన ఉత్పదాక రంగం మీద పెట్టారని తెలిపారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఐదు గంటలు కరెంట్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయన్నారు. అప్పట్లో ఒక ప్రభుత్వం ప్రో అర్బన్, ప్రో ఐటీ రంగంపై ఫోకస్ పెట్టిందని.. ఆ తర్వాత వచ్చిన సర్కార్ వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టిందని తెలిపారు. కేసీఆర్ సర్కార్ పూర్తి సమతూకంతో ముందుకు సాగుతోందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.

రేవంత్ కేసులపైనా : రేవంత్ కేసు గురించి కేటీఆర్ స్పందించారు. తాము పగ... ప్రతీకార రాజకీయాలు చేయలేదన్నారు. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారన్నారు. రేపు ఎప్పుడు అయిన పోతాడు ఏమో చూడాలంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ కర్ఫ్యూ లేదు... కరువు లేదని మంత్రి చెప్పారు. కులం కంటే గుణం ముఖ్యమని చెప్పిన కేటీఆర్ ఏ కులం వారు సీఎం అయితే ఆ కులానికి మేలు జరుగుతుందా అని ప్రశ్నించారు. బీసీ పీఎం అయితే ఓబీసీలకు ఏమైనా మేలు జరిగిందా... రేపు బీజేపీ ఓడితే బీసీలపై నెపం నెట్టే కుట్ర ఉందని మంత్రి కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications