ప్రధాని మోడీ డ్రామాలలో ఆరితేరిన వ్యక్తి; తెలంగాణాకు మీరేం న్యాయం చేశారు? తలసాని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ డ్రామాలాడుతున్నారని, కాంగ్రెస్ సరే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏంచేసిందో చెప్పాలని ప్రధాని మోడీ కి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ వేశారు. తెలంగాణ రాష్ట్రంపై ఎందుకింత కక్ష అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావు
తాజాగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ లో విపరీతమైన ద్వేషం ఉందని, పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ డ్రామాలలో ఆరితేరిన వ్యక్తి అంటూ దుమ్మెత్తిపోశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. పార్లమెంటుకు రాని వ్యక్తి మోడీ అంటూ ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణాను విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావు చెప్పు అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

సమతా మూర్తి కార్యక్రమంలో పాల్గొనే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదు
హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తన స్వార్ధానికి ఉపయోగించుకున్నారు అంటూ, యూపీ ఎన్నికల గురించి మాట్లాడారు అంటూ మోడీపై తలసాని శ్రీనివాస్ యాదవ్ దుమ్మెత్తిపోశారు. అసలు సమతా మూర్తి కార్యక్రమంలో పాల్గొనే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మోడీ ప్రధాని అయిన తరువాత ఏడు సంవత్సరాలలో ఆయన డ్రెస్ కోడ్ మారింది తప్ప, ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ మీద ఆయనకు ఎంత కక్ష ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం మొదలవుతుంది
ఇక ఇదే సమయంలో సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయడంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సీఎం హాజరుకాకపోవడంపై మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధిగా ఉంటే సరిపోతుందని ప్రధాని పర్యటనను బాయ్ కట్ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లలేదని, అయితే ఇప్పుడు ఏంటో చెప్పాలని బిజెపి నేతలకు సవాల్ విసిరారు.
Recommended Video

బిజెపిలో ఉన్నవి నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్నవి ఒకటే
బిజెపికి ఇక్కడ ఎవరు భయపడే వారు లేరని తేల్చిచెప్పారు. పిచ్చి వ్యాఖ్యలు ఆపి రాష్ట్ర డిమాండ్ లను కేంద్రం నెరవేర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు. పార్లమెంటులో ఏ ఎంపి ప్రశ్నించుకుండానే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని లేవనెత్తారని, తెలంగాణ రాష్ట్రంపై ఆయనకున్న అక్కసు ఇందుకు కారణమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో భారీ మార్పులు రాబోతున్నాయని పేర్కొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై ప్రతిపక్షాలు కుక్క అరుపులు అరుస్తూ ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బిజెపి లో ఉన్నవి నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్నవి ఒకటే నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము బిజెపి నేతలకు భయపడబోమని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ప్రజలు గుణపాఠం చెబుతారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications