విషాదం: ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య, కారణం ఇదేనా?
నిజామాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ అర్బన్ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ పార్టీ అభ్యర్థి కన్నయ్య గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో నివాసముంటున్న కన్నయ్య ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే కన్నయ్య గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కన్నయ్య గౌడ్ మొబైల్ను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసి ఆయనను బెదిరించారు. ఆయనకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు పంపి వేధింపులకు గురి చేశారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామన్నారు. దీంతో మనస్తాపానికి గురైన కన్నయ్య గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎందుకు బెదిరించారు? అతని ఫోన్కు ఎలాంటి సందేశాలు వచ్చాయి? డబ్బులు ఏమైనా మళ్లించారా.. అని పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు.
కన్నయ్య ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నయ్య అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications