కేసీఆర్.. మర్యాద కాపాడుకోండి!
కమ్యూనిస్టు పార్టీలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులంటారు.. లేదంటే తొత్తులా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా కమ్యూనిస్టులు మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టులకు ఎప్పుడు తగ్గాలో.. ఎప్పుడు నెగ్గాలో తెలుసని కూనంనేని అన్నారు. కమ్యూనిస్టులు త్యాగధనులని, కమ్యూనిస్టులు లేకుంటే పేదవాడి గురించి పోరాడేవారు లేరన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ను గౌరవస్తామని.. ఆ గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవాలని కూనంనేని సాంబశివరావు హితవు పలికారు.

కమ్యూనిస్టుల త్యాగాలేంటో కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. సీఎం పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా? అని కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ఉండటం ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు ఎజెండా తీసుకుంటామని.. వారిని మోసం చేసిన చరిత్ర కేసీఆర్దని కూనంనేని కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐకి ఎవరికి మద్దతు ఇవ్వాలో.. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలో తెలుసన్నారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని కూనంనేని సాంబశివరావు.. కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. కమ్యూనిస్టులను విమర్శించే హక్కు కేసీఆర్కు లేదన్నారు. కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా? లేక మోడీకి భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించలేదా? అని నిలదీశారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరేంటో స్పష్టంగా ప్రకటించాడని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications