ఎన్డీఏ అభ్యర్థికి ఓటెయ్యలేదు.. ఇదో కుట్ర; ప్రాణం పోయినా తప్పు చెయ్యను: సీతక్క క్లారిటీ
రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు వేసినట్టు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో తాను బిజెపి అభ్యర్థికి ఓటేసినట్టుగా వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారాలని ఎమ్మెల్యే సీతక్క ఖండించారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వ్యక్తినని, ప్రాణం పోయేంతవరకు కూడా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, పనిచేస్తున్న పార్టీకి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.
ఒకచోట ఉంటూ కోవర్ట్ గా పని చెయ్యటం, క్రాస్ ఓటింగ్ చెయ్యటం తనకు రాదన్న సీతక్క
ఒక దగ్గర పని చేస్తూ మరొకరికి కోవర్టుగా పనిచేయడం, లేదా క్రాస్ ఓటింగ్ చేయడం తన జీవితంలో లేదని, తన విధానం ఇది కాదని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. తనపై పనిగట్టుకుని చేస్తున్న ఇటువంటి ప్రచారాన్ని దయచేసి ఎవరూ నమ్మొద్దు అంటూ సీతక్క పేర్కొన్నారు. తాను ఓటు వేసే క్రమంలో మార్కర్ గీత పేపర్ పైన పడింది కానీ, ఎన్డీఏ అభ్యర్థి దగ్గర కాదని, పేపర్ పైన గీత పడిన కారణంగా, ఓటు చెల్లుతుందా లేదా అన్న అనుమానంతో తాను ఎన్నికల అధికారిని మరొక బ్యాలెట్ పేపర్ ఇవ్వవలసిందిగా కోరానని సీతక్క తెలిపారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటేశానన్న సీతక్క
గంట సేపు బ్యాలెట్ పేపర్ ఇవ్వకుండా తాత్సారం చేసిన ఎన్నికల అధికారులు, అదే బ్యాలెట్ పేపర్ తో ఓటు వేయించుకున్నారు అని, అయితే తాను తన పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశానని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. అదే విధంగా తన వ్యక్తిత్వాన్ని, కష్టపడి పనిచేసే తత్వాన్ని కించపరచకూడదు అని అందరినీ కోరుతున్నానని సీతక్క తెలిపారు. ఓటింగ్ వేసే సమయంలో పెన్ను తీస్తున్న క్రమంలో పేపర్ పైన గీత పడిందని, అభ్యర్థి పేర్ల విషయంలో తనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని సీతక్క పేర్కొన్నారు.
తనపై కుట్రపూరిత ప్రచారం జరుగుతుందన్న సీతక్క
ఒకవేళ తాను క్రాస్ ఓటింగ్ చేయాలనుకుంటే, మళ్లీ వేరే బ్యాలెట్ పేపర్ కావాలని ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదని, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని సీతక్క వెల్లడించారు. తాను ఓటు వేసే సమయంలో తన పక్క ఎవరూ లేరని, తాను ఎవరికి ఓటు వేసిన విషయం ఎవరికీ తెలియదని పేర్కొన్న సీతక్క పార్టీ ఆదేశానుసారం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే తాను ఓటు వేశానని పేర్కొన్నారు. తనపై కావాలని జరుగుతున్న కుట్ర పూరితమైన ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అంటూ ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీ కోసమే నిజాయితీగా పని చేస్తున్నా అన్న ఎమ్మెల్యే సీతక్క
తాను కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మాత్రమే పని చేస్తున్నానని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా అని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ మీద మార్కర్ గీత పడడంతో ఈ సమస్య వచ్చిందని, ఓటు చెల్లుబాటు అవుతుందా లేదా అన్న ఆందోళనతోనే తాను ఎన్నికల అధికారులను వేరే బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానని సీతక్క తెలిపారు. ఇక ఈ విషయాన్ని రకరకాలుగా వివాదం చేయాలని ప్రయత్నిస్తున్న వారిని నమ్మవద్దంటూ, పేర్కొన్న సీతక్క కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్నాను అంటూ వెల్లడించారు.