వాళ్లకు నచ్చజెప్పండి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. : సీఎం కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని అభ్యర్థులకు,రెబల్స్కు నచ్చజెప్పాలని, వారు నిరాశ చెందకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టికెట్లు దక్కనివారికి భవిష్యత్లో నామినేటెడ్ పదవులు,ఇతర అవకాశాలు ఉంటాయి కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్ఎస్ గెలుపు కోసం ఎమ్మెల్యేలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్కే అనుకూలత ఉందని, ఎమ్మెల్యేలు,మంత్రులు ఏమరపాటుగా ఉండవద్దని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలి గురించి వివరించారు. రెబల్స్ను సాధ్యమైనంత మేర బుజ్జగించే ప్రయత్నం చేయాలని,అయినా మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరించాలన్నారు. నేతల మధ్య విభేదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ఏ, బీ ఫారాలను కేసీఆర్ అందజేశారు. టీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి రావడంతో.. ఇక ప్రచార పర్వంలోకి దిగాలని ఎమ్మెల్యేలు,ఇంచార్జిలకు సూచించారు. పోటీ ఎక్కువగా కొన్ని స్థానాలు మినహా దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైపోయింది.
ఇదిలా ఉంటే, ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి,ఈటెల,నిరంజన్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంపై ముందుగానే సమాచారం అందించినా ఆలస్యమవడమేంటని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సున్నితంగా మందలించారు. ఇక ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 8 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుంది. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించనున్నారు . ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఫలితాలు వెల్లడిస్తారు. అయితే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.