సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన రహస్య జీవో బయటపెట్టి బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం ఎటువంటి ఆలోచన లేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయనను టార్గెట్ చేశారు .
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణ
మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు టీజీఐఐసీలో అందుబాటులో ఉంచిన లక్షా 75 వేల ఎకరాల భూమిని ప్రస్తుత ప్రభుత్వం కుదువపెట్టాలని కుట్ర చేస్తోందని కవిత ఈరోజు హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆరోపించారు.. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని, అన్ని భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కుదువపెట్టేలా ప్లాన్ లో భాగంగానే జీవో తీసుకొచ్చారని అన్నారు.

ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదలకు కవిత డిమాండ్
కంపెనీ హోదాను మార్చడం ద్వారా వేల కోట్ల రుణం పొందాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని కవిత ఆరోపించారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి 10 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజి లో తాకట్టు పెట్టేందుకు నిర్దిష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.
భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది
తెలంగాణ భూములను అసలు స్టాక్ ఎక్స్చేంజి లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజి లో నష్టం జరిగితే భూముల భవితవ్యం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే టీజీఐఐసీని లిమిటెడ్ కంపెనీగా మార్చాలనే ఆలోచనను వెనకకు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
ఇక ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రేవంత్ అప్పుల చిట్టా ఇలా
కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 1.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని మండిపడ్డారు. రేవంత్ చేసిన అప్పులతో ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదని కవిత స్పష్టం చేశారు. గతంలో చేసిన అప్పులకు సంబంధించి 80,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం తిరిగి చెల్లించిందని, మిగిలిన లక్ష కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.
20వేల కోట్లు సీఎం సొంత ఖజానాకు
కాంగ్రెస్ ప్రభుత్వం 20 శాతం కమీషన్ ప్రభుత్వమని, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి, అందులో 20 శాతం కమిషన్ తీసుకున్నారని కవిత ఆరోపించారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల వరకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లిందని, ఒకవేళ తాను చెప్పింది తప్పని భావిస్తే వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications