MMTS రైళ్లలో ఉచిత ప్రయాణంపై తేల్చేసిన రేవంత్ సర్కార్..!
హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వే వద్దకు తీసుకెళ్తే తిరస్కరించినట్లు ప్రచారం మొదలైంది. ఈ ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదంటూ రైల్వే వర్గాలు తోసిపుచ్చినట్లు ఈ వార్తల సారాంశం. దీనిపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని (MMTS Free Travel) రైల్వే తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ (Fact Check) ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇందులో ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయని తెలిపింది. ఇంతలో, ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని వెల్లడించింది. ఈ విషయమై, దక్షిణ మధ్య రైల్వేకు అధికారికంగా ప్రతిపాదనను కూడా సమర్పించామని, ఈ ప్రతిపాదనను, తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA), పట్టణాభివృద్ధి శాఖ సమర్పించాయని తెలిపింది.

ఈ ప్రతిపాదనను ఏప్రిల్ 7న లేఖ సంఖ్య: MA&UD/SplCS/Pesh/21 ద్వారా పంపినట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఈ ప్రతిపాదనకు దక్షిణ మధ్య రైల్వే బదులిచ్చిందని, దీనిని అమలు చేయడానికి, టర్మ్స్ & కండిషన్స్ తో కూడిన ఒప్పందాన్ని (MoU) సమర్పించమని కోరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఎంఎంటిఎస్ సేవలు, ప్రయాణీకుల సంఖ్య, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని నడుపుతున్నామని తెలిపింది. ఈ ప్రతిపాదనను తదుపరి చర్యల కోసం రైల్వే బోర్డు ఆమోదానికి పంపాల్సి ఉంటుందని చెప్పినట్లు వివరించింది. ప్రస్తుతానికి, ఈ విషయమై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని, ఎందుకంటే, ఈ విషయం ప్రస్తుతానికి పరిశీలనలోనే ఉందని తెలిపింది.

అధికారిక వివరణ
— FactCheck_Telangana (@FactCheck_TG) April 19, 2026
ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయి.
ఇంతలో, ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి.… pic.twitter.com/cMYqQpmMLX
ఎన్ని రైళ్లను నడపాలి, ఏ సమయాలలో ఈ రైళ్లను నడపాలి, ఎంఎంటిఎస్ స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా, రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రైల్వే బోర్డుకు పంపే తుది ప్రతిపాదనలో అన్ని అంశాలను చేర్చి పంపించాలని, అనంతరం, ఈ విషయంలో ఒక తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపింది. కనుక, ప్రజలు, సామాజిక మాధ్యమాలలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనను మాత్రమే నమ్మాలని కోరింది.












Click it and Unblock the Notifications