ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్..!!
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వం కనుగొందని తెలిపారు. సన్న బియ్యం పథకం ఒక అద్భుతమైన పథకమని, గతంలో 2 రూపాయల కిలో బియ్యం పథకంలాగా ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు.
రైతులకు భూ భారతి పోర్టల్ వరప్రసాదం
ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన భు భారతి పోర్టల్ యొక్క ప్రయోజనాలు రైతులకు చేరాలని అన్నార సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు ఈ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

దేశానికే ఆదర్శం ఇందిరమ్మ ఇళ్ల పథకం
ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి, అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవ్వరూ నిరాశ్రయులుగా ఉండకూడదని చెప్పిన రేవంత్... సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
కుల గణనతో 100 ఏళ్ల సమస్యకు పరిష్కారం
కుల గణన ద్వారా 100 సంవత్సరాల నాటి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు సీఎం. విద్య, ఉద్యోగాలలో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టాలు చేసిందని గుర్తుచేశారు. రాజకీయ అవకాశాలను కూడా కల్పించిందని చెప్పిన రేవంత్ రెడ్డి... ఇది తమ పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం అని వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణ సంక్లిష్ట సమస్యకు శాశ్వత పరిష్కారం
ఎస్సీ వర్గీకరణ వంటి సంక్లిష్ట సమస్యకు శాశ్వత పరిష్కారం అందించామని చెప్పిన రేవంత్ రెడ్డి... ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేసే వరకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయకపోవడానికి కారణం అదే అన్నారు. ఎస్సీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలి
ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు రేపటి నుండి (ఏప్రిల్ 16) జూన్ 2 వరకు వారి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. మే 1 నుండి జూన్ 2 వరకు ప్రజలను కలవడానికి తాను కూడా సమయం కేటాయిస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని అన్నారు రేవంత్.
ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు
హెచ్సియు భూములపై ప్రతిపక్షాలు కృత్రిమ మేధస్సును ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి ప్రధానమంత్రి మోడీ కూడా బుల్డోజర్ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. పార్టీ, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరిగితేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతూ... ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
ప్రజల్లోకి వెళ్లడమే గెలుపుకు మార్గం
మనం ప్రజలకు ఎంత మంచి చేస్తున్నామనేది మాత్రమే ముఖ్యం కాదు, ప్రజల్లోకి చేరడం కూడా చాలా ముఖ్యం అన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ గెలవాలంటే ఈ రోజు నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. ప్రజల మద్దతుతోనే విజయం సాధ్యమైందన్నారు.అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ఏమి కావాలో నివేదిక సిద్ధం చేయండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తే లేదు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది.
మోదీ భయపడుతున్నారు
నిన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని విమర్శించారని...ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా రంగంలోకి దిగారని రేవంత్ అన్నారు. ప్రజల ప్రభుత్వం తెలంగాణలో వరుస పెద్ద పథకాలు ప్రారంభించడంతో మోడీకి ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ మోడీకి అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చిన సీఎం... కుల గణన మోడీకి మరణ శాసనం అవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగ చెప్పారు సీఎం రేవంత్. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించేందుకు చేతులు కలిపాయన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పథకం ఎందుకు లేదు?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు? సన్న బియ్యం పథకం మా పథకం, మా పేటెంట్, మా బ్రాండ్. ఈ పథకం దేశానికే ఆదర్శం. తెలంగాణ పథకాలను దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications