సారీ! జర్నలిస్టుకు మోహన్ బాబు పరామర్శ, ఏమన్నారంటే?
జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై సీనియర్ నటుడు మోన్ బాబు (Mohan Babu)మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిపై దాడి చేయలేదని తెలిపారు. జర్నలిస్టులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్ను మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కుటుంబానికి క్షమాపణ చెప్పారు.
గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నీవు తొందరగా కోలుకోవాలని మోహన్ బాబు ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జర్నలిస్టుతో అన్నారు. తన వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడీ సాయినాథుడిని వేడుకుంటున్నానన్నారు. కాగా, క్షమాపణలు తనకు కాదని.. జర్నలిస్టు సమాజానికి చెప్పాలని రంజిత్.. మోహన్ బాబును కోరారు. మీ దాడిలో గాయపడ్డ నాకు, మా సంస్థతోపాటు జర్నలిస్టు సమాజం అండగా నిలిచిందన్నారు.

ఈ క్రమంలో రంజిత్ తోపాటు జర్నలిస్టులందరికీ మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. కాగా, జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం(డిసెంబర్ 10) రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మంచు మనోజ్.. మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేట్లు తీసుకుని లోపలికి దూసుకెళ్లారు.మనోజ్ తోపాటు జర్నలిస్టులు కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, కొందరు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు. మైక్ తో కొట్టడంతో ఓ జర్నలిస్టుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications