గవర్నర్ పదవి: నిరాశలో మోత్కుపల్లి, పార్టీ మారుతారా?
హైదరాబాద్: గవర్నర్ గిరీపై చాన్నాళ్లుగా ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులులో ఓపిక నశించిందో ఏమో తెలియదు గానీ కాస్తంత నిరాశతోనే మాట్లాడుతున్నారు. సోమవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేదని, వచ్చినప్పుడు విషయం చెబుతానని అన్నారు.
జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని మండిపడ్డారు. అయితే యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్లో కలపొద్దని ప్రభుత్వానికి సూచించారు.

ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇటీవలే తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవి కాలం ముగియడంతో.. ఇప్పుడు ఆ స్థానాన్ని మోత్కుపల్లితో భర్తీ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా మీడియాతో వార్తలు వస్తున్నాయి. అయితే దీని విషయమై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.
కాగా రోశయ్య స్ధానంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుని తమిళనాడు ఇన్చార్జి గవర్నర్గా కేంద్రం నియమించింది. మరోవైపు వినాయక చవితి తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ పదవి కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం లేకపోలేదని సమాచారం.
ఇదిలా ఉంటే మోత్కుపల్లికి తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించడం పట్ల కేంద్రం సానుకూలంగానే ఉన్నా.. గుజరాత్ మాజీ సీఎం నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు సమాచారం. ఇటీవలే సీఎంగా రాజీనామా చేసిన ఆనందీబెన్ కూడా తమిళనాడు గవర్నర్ పదవి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
దీంతో ఆ పదవి మోత్కుపల్లికి ఇవ్వాలా.. ఆనందీబెన్ కు ఇవ్వాలా అన్న విషయంలో కేంద్రం డైలామాలో పడినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు గవర్నర్ పదవి కోసం ఆశగా ఎదురు చూసిన మోత్కుపల్లి చివరకు అది దక్కకపోతే పార్టీ మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications