వరంగల్లో ‘వార్ వన్ సైడే’, మోడీ హవా తగ్గిందనడ కంటే..: కవిత
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో ‘వార్ వన్ సైడ్' అని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని ఆమె అన్నారు.
మంగళవారం ఎంపి కవిత హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల సమస్యలను కేంద్రానికి ఎన్నిసార్లు వివరించినా.. ఫలితం లేకుండా పోతోందని ఆరోపించారు. సమస్యలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. 16నెలలుగా హైకోర్టు విభజన కోసం ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ హవా తగ్గిందనడం కంటే..
బీహార్ ఫలితాల వల్ల ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గిందనడం కంటే.. బిజెపి పరపతి నిలుపుకోలేకపోయిందని చెప్పవచ్చని ఎంపి కవిత అన్నారు. బిజెపి కోరి తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ అని అన్నారు. పాక్ మీద నెపం నెట్టి పబ్బం గడుపుకోవడం ప్రజలకు నచ్చలేదని చెప్పారు.
బిజెపి అహంకార పూరితంగా వ్యవహరించిందని కవిత అన్నారు. రాజకీయంగా టిఆర్ఎస్, బిజెపికి ఎక్కడా పోలికలుండవని అన్నారు. టిఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అని చెప్పిన కవిత, బిజెపి అలా కాదని అన్నారు.
రాజకీయంగా టిఆర్ఎస్, బిజెపి పాలసీలు వేరని చెప్పారు. పాలనలో మాత్రం కలిసే పని చేస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రైతు సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. రైతును యూనిట్గా బీమా కల్పించాలని అన్నారు. జిఎస్టి బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తే మంచిదని కవిత అన్నారు.
కెసిఆర్పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు అభ్యర్థుల వయసును సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు భన్వర్ లాల్ ను కోరినట్లు తెలిసింది.